చిత్రసీమలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు

,

తెలుగు చిత్రసీమలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ నటుడు మరణించగా, ప్రముఖ డైరెక్టర్ తండ్రి కన్నుమూసిన ఘటన ఆదివారం చోటుచేసుకున్నాయి. టాలీవుడ్ దర్శకుడు బాబీ తండ్రి మోహనరావు (69) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధి తో బాధపడుతూ.. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో నేటి మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మోహనరావు అంత్యక్రియలు రేపు (సోమవారం) గుంటూరులోని నగరంపాలెంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం బాబీ చిరంజీవి తో సినిమా చేస్తున్నాడు.

ఇక మరో విషాద ఘటన..సీనియర్ నటుడు విద్యాసాగర్ రాజు (73) మృతి చెందారు. కొన్నాళ్ల కిందట పక్షవాతానికి గురైన విద్యాసాగర్ ఈరోజు ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపారు. మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, అహ నా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ లో 100కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక విద్యాసాగర్ అర్ధాంగి రత్నప్రభ కూడా సినీ నటే. ఆమె జంధ్యాల సినిమాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఇలా రెండు విషాద ఘటనలు చోటుచేసుకోవడం తో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.