కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి

ల్యాండ్ చేస్తుండగా హెలికాప్టర్ లో చెలరేగిన మంటలు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్​పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఇద్దరు పైలట్లలో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడువగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారని ఎస్‌ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఈ ప్రమాదం గురించి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి 9.10 గంటల సమయంలో ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. హెలికాప్టర్ ను ల్యాండ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారని… ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఇతర ప్రయాణికులు ఎవరూ లేరని వెల్లడించారు.

అయితే ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై డీజీసీఏ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించాయి. ఈ ప్రమాదం పట్ల ఛత్తీస్ గఢ్ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన పైలట్లకు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/