అమిత్ షాతో సమావేశమైన కేఏ పాల్

రాష్ట్రాలు ఇలానే అప్పులు చేసుకుంటూ పోతే దేశం మరో శ్రీలంక అవుతుందన్న పాల్

న్యూఢిల్లీ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గతరాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమిత్ షాతో పలు విషయాలపై చర్చించినట్టు చెప్పారు. ఇటీవల తనపై జరిగిన దాడి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రూ. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రూ. 4.5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అప్పులు ఇలాగే చేసుకుంటూ పోతే త్వరలోనే దేశం మరో శ్రీలంక అవడం ఖాయమని హెచ్చరించారు. ఇక తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తన జీవితంలోనే ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణలో డీజీపీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదని, కానీ అమిత్ షా అడగ్గానే ఇచ్చారని అన్నారు. ప్రధాని మోడీని కలవాలని షా సూచించారన్నారు. ప్రజాశాంతి పార్టీ భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/