బాలిక ఇష్టంతో కలిసిన అది అత్యాచారమే: తెలంగాణ హైకోర్టు

బంజారాహిల్స్ బాలిక కేసులో హైకోర్టు తీర్పు
గర్భం తొలగించుకునేందుకు అనుమతి

హైదరాబాద్ : బాలిక ఇష్టంతోనే అయినా ఆమెతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారమే అవుతుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటి నుంచి తీసుకెళ్లిన బంధువు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈ కేసులో బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిచ్చిన కోర్టు.. బాలిక ఇష్టపూర్వకంగానే బంధువుతో వెళ్లినా, లైంగికంగా కలిసినా అది అత్యాచారం పరిధిలోకే వస్తుందని పేర్కొంది. గర్భం దాల్చిన కారణంగా బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని, శారీరకంగాను, మానసికంగాను ఆమెపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ఖమ్మం జిల్లాలో ఉన్నవివాహితుడైన బంధువు (26) వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో బాలిక ఇంటికి వచ్చిన అతడు ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నిందితుడు ఖమ్మం వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు, బాలిక గర్భం దాల్చడంతో దానిని తొలగించేందుకు నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, బాలిక అప్పటికే 20 వారాల గర్భిణి కావడంతో తొలగించడం ఆమె ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతూ గర్భాన్ని తొలగించేందుకు నిరాకరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిచ్చింది. ఈ సందర్భంగానే కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/