మహాధర్నా ముగిశాక రాజ్ భవన్ కు తెరాస నేతలు పాదయాత్ర..?
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఫై పోరుబాట పట్టిన తెరాస సర్కార్ గురువారం ఇందిరా పార్క్ లో మహాధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి నుండి మొదలు పెడితే కింద స్థాయి నేతల వరకు ఈ ధర్నా లో పాలుపంచుకున్నారు. కేంద్రం ఫై విమర్శలు చేస్తూ ధర్నా కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కొనసాగనుంది. ఈ ధర్నా అనంతరం తెరాస నేతలంతా రాజ్ భవన్ కు పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి సచివాలయం మీదుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు వినతిపత్రం సమర్పించబోతున్నట్లు సమాచారం.
ఇక ధర్నా లో కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదాకా అయినా సరే పోయి మన ప్రజల ప్రయోజనాలను రక్షించుకోవాలి. తెలంగాణ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి అశనిపాతంలాగా ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపరిస్తున్నాయి. వాటిని ఎదర్కోవడానికి, కండ్లు తెరిపించడానికీ ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టాం.