మోడీ టూర్ కు దూరంగా టిఆర్ఎస్ నేతలు

మరికాసేపట్లో ప్రధాని మోడీ రామగుండంకు చేరుకోబోతున్నారు. ఈ క్రమంలో మోడీకి స్వాగతం పలికేందుకు ఏ ఒక్క టిఆర్ఎస్ నేత అందుబాటులో లేరు. బీజేపీతో వార్ కొనసాగుతున్న క్రమంలో మోడీ టూర్ కు దూరంగా ఉండాలని , అలాగే ఎలాంటి నిరసనలు తెలియజేకుండా ఉండాలని నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారట. రామగుండంలో వామపక్షాలు ఆందోళనలు చేస్తుండటంతో.. టీఆర్ఎస్ కూడా నిరసలు తెలపాలని భావించింది. కానీ చివరి నిమిషంలో టీఆర్ఎస్ అధిష్టానం నుంచి సూచనలు రావడంతో స్థానిక గులాబీ నేతలు వెనక్కి తగ్గారు.

ప్రధాని మోడీ వస్తుండటంతో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఏ ఒక్క నేత కూడా జిల్లాలో లేరట. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దపల్లి జిల్లాలోనే మోడీ సభజరుగుతున్న క్రమంలో.. ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి వారణాసికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కూడా హైదరాబాద్ చేరుకోగా.. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా నియోజకవర్గాన్ని వదిలి శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లినట్లు సమాచారం. మరి దీనిపై బిజెపి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.