నడిరోడ్డుపై గుట్టలుగా కరెన్సీ తుక్కు

నల్లధనం కానీ, నకిలీ నోట్లు కానీ అయ్యే అవకాశం ఉంటుందన్న పోలీసులు

నిజామాబాద్: హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై గుట్టలుగా పడి ఉన్న చిరిగిన నోట్లు కలకలం రేపాయి. నడిరోడ్డుపై గుట్టలుగా పడివున్న వాటిని చూసి జనం షాకయ్యారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? తుక్కుగా ఎలా మారాయి? అన్న విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నోట్ల కట్టలున్న సంచి లారీ పైనుంచి కిందపడి ఉంటుందని, దానిపై నుంచి వాహనాలు వెళ్లడంతో నోట్లన్నీ ఇలా చినిగిపోయి ఉంటాయని భావిస్తున్నారు.

అయితే, వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అవి అసలైనవా? లేక, నకిలీవా? ఒకవేళ అసలైనవే అయితే ఇలా ఎందుకు తుక్కుగా మార్చారు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. రిజర్వు బ్యాంకు ఇలా చేసే అవకాశం లేదని, పాత నోట్లను అది రహస్య ప్రదేశంలో కాల్చివేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఇది నల్లధనం కానీ, నకిలీ నోట్లు కానీ అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నోట్లున్న సంచి ఏ వాహనం నుంచి జారిపడిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/