కొంత కాలానికి భారత్, అమెరికా సంబంధాలు బలహీన పడొచ్చుః అమెరికా రాయబారి

దీనికి భిన్నంగా బైడెన్ ప్రభుత్వంలోని కొందరి సభ్యుల వాదన

Ties with India ‘could get worse’ due to Canada row, US envoy told team: Report

వాషింగ్టన్‌ః భారత్-కెనడా మధ్య వివాదం చివరికి ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కాకుండా ఉంది. ఖలిస్థానీ ఉగ్రవాది (కెనడా దృష్టిలో నేత, సొంత పౌరుడు) హర్దీప్ సింగ్ నిజ్జర్ ను జూన్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపగా, భారత ఏజెంట్లే ఈ పని చేసినట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ, ఇదే విషయాన్ని ఐదు దేశాల ఇంటెలిజెన్స్ కూటమి (ఫైవ్ ఐస్/అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా)కి నివేదించారు.

ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆధారాలుంటే తమకు అందించాలని, తప్పకుండా పరిశీలిస్తామని ప్రకటించింది. దీనిపై కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని అమెరికా సూచించింది. దీనిపై భారత్ వైఖరిని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, అమెరికా విదేశాంగ మంత్రికి విదేశాంగ మంత్రి జైశంకర్ తెలియజేశారు. ప్రపంచంలో భవిష్యత్ సూపర్ పవర్ కానున్న భారత్ తో సంబంధాలకే అమెరికా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చన్న విశ్లేషణ పలువురు నిపుణుల నుంచి వ్యక్తమైంది. ఈ దౌత్య వివాదం కెనడాకే నష్టం చేయవచ్చన్న అభిప్రాయం వినిపించింది.

కానీ, భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తాజా వ్యాఖ్యలు.. కెనడాకే మద్దతు పలికేలా ఉన్నాయి. తన దేశ బృందంతో గార్సెట్టి పంచుకున్న అభిప్రాయాలు వెలుగు చూశాయి. కెనడాతో దౌత్య వివాదం ఫలితంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు కొంత కాలానికి దెబ్బతినొచ్చని గార్సెట్టి పేర్కొన్నారు. భారత్ తో సంబంధాలను అమెరికా తగ్గించుకోవచ్చన్నారు. ఈ విషయంలో అమెరికా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు పొలిటికో అనే పోర్టల్ కథనం పేర్కొంది. అయితే జోబైడెన్ ప్రభుత్వంలోని కొందరు మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో సంబంధాలు సమీప కాలంలో మరింత సన్నిహితంగా ఉంటాయని నమ్ముతున్నారు.