రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఓమిక్రాన్..ఖమ్మంలో ఒక ఓమిక్రాన్ కేసు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దుబాయి నుంచి ఇటీవల వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ గుర్తించగా… బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్ వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో సోమవారం తేలింది. ముగ్గురు బాధితులను చికిత్స కోసం టిమ్స్‌కు తరలించారు. ఈ మూడు కొత్త కేసులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 4కు చేరింది. అలాగే ఖమ్మం జిల్లా లో కూడా ఓమిక్రాన్ కేసు బయటపడింది.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంచేస్తున్న ఓ యువతి ఈనెల 19న ఖమ్మంలోని ఓ బహుళ అంతస్తులో నివాసముంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. కరోనా అనుమానిత లక్షణాలతో ఈనెల 20న ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. యువతి నుంచి సేకరించిన నమూనాను వైద్యసిబ్బంది ఒమిక్రాన్‌ అనుమానిత పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించారు. అక్కడ జీనోమ్‌ సీక్వెన్స్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. వైద్య బృందాలు ఆమె కుటుంబీకులను కలిసి అప్రమత్తం చేశారు. యువతి కరోనా టీకా రెండు డోసులు తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తేల్చారు.