గోదావరి నది ఉగ్రరూపం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ

53.1 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం

third-danger-alert-in-bhadrachalam-after-godavari-reached-53-foot

భద్రాచలం: గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుండటంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు 52.1 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటి మట్టం ఆ తర్వాత కొద్ది సమయంలోనే 53 అడుగులను దాటింది. నీటిమట్టం 53.1 అడుగులకు చేరుకోవడంతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 5 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం నీట మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం చుట్టుపక్కల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. గోదావరి నీటిమట్టం 56 నుండి 58 అడుగులకు చేరుకునే అవకాశమున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో 14,32,336 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.