మంత్రి పేర్ని నానితో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం
perni-nani
అమరావతి : ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనల పేరిట మూసివేత వంటి అంశాలపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీంతో ఏపీ మంత్రి పేర్ని నానితో సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆయా అంశాలపై చర్చించడానికి అపాయింట్మెంట్ కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. దీంతో పేర్ని నానితో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు సమావేశం అయ్యారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్లో ఈ చర్చలు కొనసాగుతున్నాయి.
సినిమా టికెట్ల ధరల తగ్గుదల వల్ల సినిమా థియేటర్లు మూసివేత పరిస్థితులు వచ్చాయని వారు మంత్రితో చెప్పారు. తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని అన్నారు. తనిఖీల వల్ల ఎలా నష్టపోతున్నామన్న విషయంపై కూడా వారు మంత్రికి వివరిస్తున్నట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో నిర్వహణ వ్యయం కూడా పెరిగిందని, టికెట్ల ధరలను తగ్గిస్తే థియేటర్లను కొనసాగించలేమని వారు తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనల అంశాలపై ప్రభుత్వ విధానంపై పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడి వివరించే అవకాశం ఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/