ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుకు నివాళ్లు అర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ
గుత్తికోయలు చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు నివాళ్లు అర్పించారు. శ్రీనివాసరావు పాడెపట్టి ముందుకు నడిచారు. మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రెగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్ఘీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ దొబ్రియల్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా శ్రీనివాస్ రావు కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాధికారులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. శ్రీనివాసరావుపై దాడికి పాల్పడి హత్యచేసిన వారిని తప్పక శిక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ ఘటను చాలా సీరియస్గా తీసుకుందన్నారు.
అసలు ఏంజరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తి కోయలు అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతున్నట్లు సమాచారం అందడంతో రేంజర్ శ్రీనివాసరావు మండల అధికారి సంజీవరావుతో కలసి అడవుల్లో చెట్లు నరుకుతున్న గుత్తి కోయల వద్దకు వెళ్లారు. చెట్లను నరకవద్దని గుత్తి కోయలకు అధికారులు ఇద్దరూ సూచించారు. తమను అడ్డుకోవద్దని అధికారులను బెదిరించారు.
అంతటితో ఆగకుండా రేంజర్ శ్రీనివాసరావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో రేంజర్ శ్రీనివాసరావు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న శ్రీనివాసరావును అటవీ సిబ్బంది హుటాహుటిన కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అధికారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్ఓ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏ విధంగా అయితే.. నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో.. అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు.
మరోపక్క శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారని జిల్లా ఎస్పీ తెలిపారు.