అవినాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

రేపు వాదనలు వింటామన్న తెలంగాణ హైకోర్టు

telangana-high-court-postponed-the-hearing-on-mp-avinash-bail-petition

హైదరాబాద్ః కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌సిపి నేత అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి చెప్పారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ… అవినాశ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన తండ్రి వైయస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆరు రోజుల క్రితం ముందస్తు బెయిల్ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు… ఇరువైపుల వాదనలు వినడంతో పాటు, ఈ నెల 25న విచారణ, తీర్పు చెబుతామని తెలిపి, అప్పటి వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో రేపు వాదనలు వింటామంటూ అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది న్యాయమూర్తి. ఈ రోజు ఉదయం ఈ కేసు హియరింగ్ కు వచ్చింది. ఇవాళ త్వరగా విచారణ జరపాలని అవినాశ్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే సుప్రీం కోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు. సుప్రీం కోర్టు డాక్యుమెంట్స్ లేకుండా విచారణ కొనసాగించలేమని, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా విచారణ ఉంటుందని జడ్జి తెలిపారు. అయితే మధ్యాహ్నం సుప్రీం ఉత్తర్వులు సమర్పిస్తామని అవినాశ్ తరఫు లాయర్ తెలిపారు.