బిఆర్ఎస్‌కు సునీతా మహేందర్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్‌లోకి!

brs

హైదరాబాద్‌ః బిఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు బిఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు హృదయభారంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని కెసిఆర్‌కు పంపించిన లేఖలో పేర్కొన్నారు. తన పదవీకాలంలో సహకరించిన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా, తన భర్త, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.