జనసేనకు.. స్టంట్ మేన్ విరాళం

జనసేన పార్టీ కి స్టంట్ మేన్ రూ.50 వేల విరాళం ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. బుధవారం సాయంత్రం స్టంట్ మెన్ శ్రీ బద్రి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో భోళాశంకర్ సినిమాలో చేసిన స్టంట్స్ కి గాను తాను అందుకున్న పారితోషికం రూ. 50 వేలు జనసేన పార్టీకి విరాళంగా అందచేశారు బద్రి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శ్రీ బద్రికి ధన్యవాదాలు తెలిపారు.

బద్రి మాట్లాడుతూ “28 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయం నన్ను నిలబెట్టిందని, సార్ చేసే సాయం నాతో ఆగిపోకూడదు ఎందరికో ఆయన సహాయం అందిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే నాలాంటి ఎంతో మందికి అండగా నిలుస్తారని, ఆ ఆకాంక్షతోనే భోళాశంకర్ చిత్రానికి వచ్చిన పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాను అని అన్నారు.

సినిమాల్లో కార్లను పల్టీలు కొట్టిస్తూ చేసే డేర్ డెవిల్ స్టంట్స్ ఎంతో కష్ట సాధ్యమైందని, సాహసంతో కూడుకున్నవి, తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి స్టంట్స్ చేయడం శ్రీ బద్రికి మాత్రమే సాధ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి శ్రీ బద్రితో పరిచయం ఉందన్న ఆయన భోళాశంకర్ చిత్రంలో చేసిన స్టంట్స్ కి ఆయన్ని అభినందించారు.