కాజీపేటలో దారుణం : వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి

వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి చెందింది. కొద్దీ రోజుల క్రితం హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత GHMC వీధి కుక్కల విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి పెద్దగా ఆచరణలోకి తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా పలు కుక్కల దాడులు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. శుక్రవారం ఉదయం కాజీపేట రైల్వేపార్క్ దగ్గర వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారి చోటూపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో చోటూ తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటి నిండా రక్తపుగాయాలతో పడి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్నారి చోటూ కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు.