ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత
ప్రముఖ నిర్మాత గురుపాదం మృతి
చెన్నైః ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు ఆలపించారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ప్రముఖ నిర్మాత ఆర్వీ గురుపాదం మృతి చెందారు. ఈ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం భాషల్లో 25 చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్ లో శ్రీదేవి హీరోయిన్ గా ‘అకల్ మండ్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువదించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.