టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు..వెలుగులోకి కీలక అంశాలు

డీఈ రమేష్ ద్వారా ఓ మాజీ ఎంపీటీసీ కూతురు పరీక్ష రాసినట్లుగా వెల్లడి

shockings-in-tspsc-paper-leak

హైదరాబాద్‌ః టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. కోర్టు అనుమతితో ఇటీవల విద్యుత్ శాఖ డీఈ రమేష్ ను కస్టడీకి తీసుకున్న సిట్, అతనిని విచారించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో రమేష్ ఒప్పందం చేసుకున్నట్లుగా ఈ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ కూతురు… రమేష్ ద్వారా ఏఈఈ పరీక్షను రాసినట్లు తేలింది. ఏఈఈ ఉద్యోగం ఇప్పిస్తానని రమేష్ రూ.75 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఏఈఈ పరీక్ష జనవరి 22న జరిగింది. ఈ పరీక్షకు నెల రోజుల ముందే సదరు మాజీ ఎంపీటీసీని కలిశాడు రమేష్. పరీక్షకు ముందు ఆమెకు ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. తన కూతురుకు ఉద్యోగం వచ్చాకనే డబ్బులు చెల్లిస్తానని రమేష్ తో చెప్పాడు. ఎలక్ట్రానిక్ డివైజ్ జాకెట్ కోసం కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది. డీఈ రమేష్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్లుగా గుర్తించారు. ఒక్కొక్కరి నుండి కనీసం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.