ఆటోను ఢీ కొట్టిన లారీ .. ఏడుగురు చిన్నారులకు గాయాలు

Road Accident
Road accident

అమరావతిః ఈరోజు ఉదయంవిశాఖపట్నం నగరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటోను సంగం థియేటర్ కూడలి వద్ద వెనుకగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో మూడు పల్టీలు కొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగగా.. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు, ఆటో డ్రైవర్లు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.