ఆర్ఆర్ఆర్ మరో ఘనత
బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా సత్తా చాటిన డైరెక్టర్ రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో మరో స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయ్ దేవగన్ , శ్రీయ మొదలగు నటి నటులు నటించిన ఈ మూవీ పాన్ ఇండియా గా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో అవార్డు దక్కించుకుంది.
సటర్న్ అవార్డ్స్లో ఆర్ఆర్ఆర్ ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు’కు ఎంపికైంది. సటర్న్ అవార్డ్స్ ఈ ఏడాదితో 50 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డును జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ ను అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇది తనకు రెండో సటర్న్ అవార్డు అని రాజమౌళి అన్నాడు. అవార్డులు గెలుచుకున్న ఇతర విజేతలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు రాజమౌళి. సాధారణంగా అమెరికాలోని హాలీవుడ్ చిత్రాలకి ఈ సటర్న్ అవార్డుని అందజేస్తుంటారు. ఈ క్రమంలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో పోటీపడిన ‘ఆర్ఆర్ఆర్’ అన్ని చిత్రాల్ని వెనక్కి నెట్టి అవార్డుని సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్తో రూపొందిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకి పైనే వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు జపాన్లో కూడా విడుదలైంది. దాంతో ఎన్టీఆర్, రామ్ చరణ్తో పాటు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వెళ్లారు.