సీఎం స్టాలిన్ ఫోన్ చేయడం ముగ్ధురాలిని చేసిందిః మంత్రి రోజా

ఇటీవల అస్వస్థతకు గురైన మంత్రి రోజా

roja-says-tamil nadu-cm-stalin-asked-her-health-condition

అమరావతిః ఏపీ మంత్రి రోజా కొన్నిరోజుల కిందట అస్వస్థతకు గురై చెన్నై ఆసుపత్రిలో చేరారు. ఉన్నట్టుండి మంత్రి రోజా ఆసుపత్రిలో చేరడంతో ఆమెకు ఏమైందన్న ఆందోళన నెలకొంది. అయితే, రోజా వెన్నెముక, కాలు నొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది. కాగా, ఈరోజు మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనకు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. ఆయన మానవీయ స్పందనకు ముగ్ధురాలినయ్యానని రోజా తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని కూడా సలహా ఇచ్చారని వివరించారు.

“గతంలో తాను కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యతోనే బాధపడినట్టు సీఎం స్టాలిన్ వెల్లడించారు. అంతేకాదు, ఆ సమస్యను ఎలా అధిగమించారో కూడా ఆయన చెప్పారు. నా ఆరోగ్యం పట్ల ఆయన చూపిన శ్రద్ధ, ప్రతి ఒక్కరి పట్ల ఆయన చూపించే ఆపేక్ష ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన గొప్ప పాలకుడే కాదు, ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకునే మనసున్న మనిషి కూడా. థాంక్యూ వెరీమచ్ సర్” అంటూ రోజా ట్వీట్ చేశారు.