కాంగ్రెస్ రాగానే ధరణి కంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకు వస్తాం: రేవంత్ రెడ్డి

బిఆర్ఎస్ నేతల వద్ద డబ్బులుంటే… కాంగ్రెస్ నేతల వద్ద ఓట్లు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి

revanth-reddy-says-congress-have-people-support

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ నేతల వద్ద డబ్బులు ఉంటే, కాంగ్రెస్ నేతల వద్ద ఓట్లు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఖానాపూర్‌లో పార్టీ అభ్యర్థి బొజ్జు పటేల్‌కు మద్దతుగా నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్, బిజెపి డబ్బులు ఉన్న వారిని తమ అభ్యర్థులుగా ప్రకటించాయన్నారు.

కాంగ్రెస్ ప్రజామద్దతు ఉన్న వారిని ప్రకటించామన్నారు. తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి, అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకు వస్తామన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పారు. బిఆర్ఎస్ ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి పేదల భూములను గుంజుకుందన్నారు. రైతులను బిఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ జిల్లాను అభివృద్ధి చేసేందుకు తాము ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించామని, కానీ బిఆర్ఎస్ కనీసం కడెం ప్రాజెక్టు నిర్వహణను చేపట్టలేకపోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములు పంచి పెట్టిందన్నారు.