ఇండిగో సిబ్బందిపై మంత్రి కెటిఆర్‌ ఆగ్రహం

స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఇండిగోకు కెటిఆర్‌ సూచన

minister-ktr

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్‌​ తాజాగా ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలికి ఎదురైన అవమానకర ఘటనపై స్పందించారు. హిందీ/ఇంగ్లీష్ రాదని తెలుగు మహిళపై సిబ్బంది ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన సీట్లోంచి తీసుకెళ్లి మరో చోట కూర్చోబెట్టిన సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఘటనపై అహ్మదాబాద్‌ ఐఐఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేవస్మిత తన ట్విటర్​లో పోస్ట్ చేశారు.

తెలుగు మహిళ సెప్టెంబర్ 16న విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో 6E 7297లో వెళ్తున్నారు. 2A(XL seat, Exit row)లో ఆ మహిళ కూర్చొని ఉండగా.. అక్కడి సిబ్బంది ఆమెకు హిందీ/ఇంగ్లిష్‌ రాదని తెలుసుకొని 3c సీట్లోకి మార్చేశారు. ఆమెతో మాట్లాడిన ఫ్లైట్‌ అటెండెంట్‌ భద్రతాపరమైన ఆందోళనగా పేర్కొంటూ తెలుగు మహిళ పట్ల వివక్ష ప్రదర్శించారంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత కేటీఆర్​కు ట్వీట్‌ చేశారు.ట్విటర్​లో ఎప్పుడు చురుకుగా ఉండే మంత్రి కెటిఆర్ ఆమె చేసిన ట్వీట్​పై స్పందించారు. ఆ మహిళ చేసిన పోస్ట్​ను ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు. ఇప్పటి నుంచైనా స్థానిక భాషలు మాట్లాడే ప్రయాణికులనూ గౌరవించాలని పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీష్ రాని వారిని చులకనగా చూడకుండా అలాంటి ప్రయాణికుల్ని గౌరవించాలని సూచించారు. విమానాలు ప్రయాణించే రూట్ల ఆధారంగా వివిధ భాషలు మాట్లాడే నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఆ విధంగా సిబ్బందిని నియమిస్తే ప్రయాణికులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/