అయోధ్య చిత్రాలతో బనారస్ చీరలు.. దేశవ్యాప్తంగా పెరిగిన గిరాకీ

విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయంటున్న వ్యాపారులు

high-demand-for-ram-mandir-theme-special-sarees

న్యూఢిల్లీః అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో బనారస్ చీరలకు డిమాండ్ పెరిగింది. అది కూడా రామ మందిరం థీమ్ తో ప్రత్యేకంగా డిజైన్ చేసివ్వాలంటూ మహిళలు ఆర్డర్లు పెడుతున్నారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు దేశవ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా రామ మందిరం థీమ్ తో నేసిన చీరలు ధరించాలని మహిళలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బనారస్ లోని వ్యాపారులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.

దేశం నలుమూలల నుంచి, అమెరికా వంటి విదేశాల నుంచి కూడా ఈ స్పెషల్ చీరలు కావాలంటూ ఫోన్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కాగా, క్వాలిటీ, డిజైన్ను బట్టి ఒక్కో చీర ధర రూ.7 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్ముతుంటామని వివరించారు. యూపీలోని ముబారక్‌‌పూర్ ప్రాంతానికి చెందిన నేత అనిసూర్ రెహమాన్ మాట్లాడుతూ..‘‘చారిత్రక విశేషాలను తెలుపుతూ తయారుచేసే చీరలకు మా దగ్గర చాలా డిమాండ్ ఉంది. అయితే మేము ఇప్పుడు రామమందిరం థీమ్‌‌తో చీరలను సిద్ధం చేస్తున్నాం. ఇవి త్వరలో ట్రెండ్ సృష్టించబోతున్నాయి’’ అని ఆయన చెప్పారు. పీలి కోఠి ప్రాంతానికి చెందిన మరో నేత మదన్ స్పందిస్తూ.. ‘‘రామ్ దర్బార్ వర్ణన ఉన్న చీరలకు చాలా డిమాండ్ ఉంది. అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి” అని తెలిపారు.