మణిపూర్లో భారతమాతను హత్య చేశారు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీః ప్రధానమంత్రి మోడీ దృష్టిలో మణిపూర్ దేశంలో భాగం కాదని రాహుల్ గాంధీ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ మణిపూర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. మణిపూర్ ప్రజల భరోసాను చంపేశారు.‘‘మోడీ మణిపూర్ను రెండు వర్గాలుగా విడగొట్టారు. మీకు రాజనీతి లేదు. మణిపూర్లో భారత మాతను హత్య చేశారు. నేను అబద్ధాలు చెప్పడం లేదు. మీరే అబద్ధాలు చెబుతారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని చంపేశారు. మీరు దేశభక్తులు కాదు.. దేశ ద్రోహులు. మన సైన్యం తలచుకుంటే మణిపూర్లో ఒక్కరోజులోనే శాంతి సాధ్యం. కానీ మీరు దేశాన్ని రక్షించే వారు కాదు.. దేశ హంతకులు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై బిజెపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
కొన్నిరోజుల క్రితం నేను మణిపూర్ వెళ్లాను. ప్రధాని మోడీ ఇప్పటి వరకు మణిపూర్ వెళ్లలేదు. ప్రధాని మోడీ దృష్టిలో మణిపూర్ దేశంలో భాగం కాదు. మణిపూర్ పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో నేను మాట్లాడాను. మణిపూర్ బాధితులకు మద్దతుగా నేను రాత్రంతా వారితో గడిపాను. అంటూ రాహుల్ ప్రసంగం కొనసాగింది.