రైతులకు సకాలంలో పంటరుణాలు అందించాలి

హైదరాబాద్: ఆర్థిక శాఖ హరీశ్‌ రావు సోమవారం బీఆర్కే భవన్‌లో ఎస్‌ఎల్‌బీసీ (SLBC) 29 వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో యానివల్‌ క్రెడిట్‌ ప్లాన్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని హరీశ్‌ రావు బ్యాంకర్లను కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7,360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారని, బ్యాంకులుఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని మంత్రి కోరారు. తద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కొవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించాయని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/