తప్పుడు డిజైన్ వల్ల కాళేశ్వరంలో రూ. 7 వేల కోట్లు దుర్వినియోగం: ప్రొఫెసర్ కోదండరాం

కెసిఆర్ ఏ పనిచేసినా అందులో ఎంత మిగులుతుందని లెక్కలు వేసుకుంటారు.. కోదండరాం

kodandaram
kodandaram

హైదరాబాద్‌ః తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌ను కెసిఆర్ మానసిక క్షోభకు గురిచేశారని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ కీలక ఆరోపణలు చేశారు. కెసిఆర్ తనకంటే ఎక్కువగా ప్రొఫెసర్ జయశంకర్‌కే ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. ఆయనకు లోక్‌సభ టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా క్షోభకు గురిచేశారన్నారు. కెసిఆర్‌తో వేగలేమని ఉద్యమ సమయంలోనే తనకు అర్థమైందని అన్నారు. కెసిఆర్‌ది ఫ్యూడల్ పాలన, ఆధిపత్యం మాత్రమేనని అనుకున్నామని కానీ, నాలుగైదేళ్ల తర్వాత తన అధికారాన్ని వనరులను కొల్లగొట్టేందుకు వాడుకుంటున్నట్టు తెలిసిందన్నారు. 2018 తర్వాత పింఛన్లు, రేషన్ కార్డులు తప్ప ధరణి సహా ఏ పని చేపట్టినా అందులో ఎంత మిగులుతుందని కెసిఆర్‌ లెక్కలు వేసుకునేవారని అన్నారు.

ప్రజలిచ్చిన అధికారాన్ని సొంతానికి వాడుకోవడం, వనరులు కొల్లగొట్టడానికి ఉపయోగించుకుంటున్నట్టు గ్రహించడానికి తమకు ఐదారేళ్లు పట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డబ్బు చుట్టూనే తిరిగిందని, నాగం జనార్ధన్‌రెడ్డి లెక్కల ప్రకారం తప్పుడు డిజైన్ వల్ల రూ. 7 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. నిరసనలు ఎవరు చేసినా అణచివేయడం, అరెస్ట్ చేయడమే కెసిఆర్‌ పని అని, తనను 15-20 సార్లు అరెస్ట్ చేశారని తెలిపారు. కెసిఆర్‌కు హిట్లర్ రోల్‌మోడల్ అని, ఆయన ఆత్మకథ ‘మీన్‌క్యాంఫ్’ కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణ అంటే తానేనని, తనవల్లే వచ్చిందని, తనను ప్రశ్నించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని, ప్రజల్లో కెసిఆర్‌పై చాలా వ్యతిరేకత ఉందని కోదండరాం ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.