భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం ముందుకు సాగుతుందిః రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండు రోజుల పర్యటన కొసం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె దుండిగల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా ఆఫీసర్లను రిక్రూట్ చేయడం సంతోషకరమన్నారు. మహిళా ఫైటర్ పైలెట్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏప్రిల్లో తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లో విహరించినట్లు ఆమె తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్లో బ్రహ్మపుత్రి, తేజ్పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఎగరడం గొప్ప అనుభూతిని మిగిల్చినట్లు ముర్ము తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు.
కాగా, బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఇకపోతే, పరేడ్కి రివ్యూయింగ్ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఎయిర్ ఫోర్స్ అకాడమీ చరిత్రలో ఇది మొదటి సారి. రాష్ట్రపతి ముర్ముతోపాటే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంత కుమారి హాజరుకానున్నారు.