వైఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైందన్న ప్రశాంత్ రెడ్డి

vemula prashanth reddy
vemula prashanth reddy

టీఆర్ఎస్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. YSRTP అధినేత్రి షర్మిల అరెస్ట్ తో తెలంగాణ లో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. షర్మిల అరెస్ట్ ఫై బిజెపి , కాంగ్రెస్ పార్టీ లు తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ ఉద్యమానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల తీరని అన్యాయం జరిగిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే… తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని ఏకంగా సోనియా గాంధీనే రాజశేఖరరెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ కారణంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు సోనియా ఒప్పుకున్నా… వైఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలతో వెనక్కు తగ్గారని ఆయన అన్నారు.

రాజశేఖర్ రెడ్డి వల్లే తెలంగాణకు చెందిన వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని ప్రశాంత్ రెడ్ది ఆరోపించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చెందిన వందల మంది బిడ్డలను పొట్టనబెట్టుకుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో నాడు కేంద్ర మంత్రి పదవిని కేసీఆర్ గడ్డిపోచలా వదిలేశారన్నారు. తనతో పాటు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులతో రాజీనామాలు చేయించిన కేసీఆర్… తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారన్నారు.

మరోపక్క ప్రగతి భవన్ ముట్టడికి ట్రై చేసిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటి క్రితమే ఆమెను నాంపల్లి కోర్ట్ లో హాజరు పరిచారు.