బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్దా!
వార్తల్లోని వ్యక్తి: ప్రతి సోమవారం
మన రాష్ట్రపతులు విభిన్న ప్రవృతులు కలవారు. పథమ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ బహుధా సౌమ్యుడు. రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణయ్య (అసలు పేరు అదే) తత్వవేత్త.
మూడవ రాష్ట్రపతి జాకిర్హుస్సేన్ విద్యావేత్త. వి.వి.గిరి కార్మికనాయకుడు. అబ్దుల్ కలాం శాస్త్రవేత్త. ప్రతిభాపాటిల్ ఏమీ కాదు.
రామ్నాథ్ కోవింద్ కేవలం రాష్ట్రపతి. ఇలా చెప్పుకుంటూపోతే, ప్రతివారికి ఏదో ప్రత్యేకత ఉంటుంది.
కాని, మొన్న పరమపదించిన ప్రణబ్ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాధురీణుడు ఆయన కేంద్రంలో నిర్వహించని జటిలమైన శాఖే లేదు.
విదేశాంగ మంత్రి, వాణిజ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఎక్కడ తగవ్ఞ వచ్చినా తీర్పరి.
ఈ రాష్ట్రపతులలో కొందరికైనా పుట్టుమచ్చలంత మచ్చల నుంచి పెద్ద మచ్చలేవున్నాయి క.
ాని, ఏ మచ్చాలేని బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్దా.
ప్రధాని కావలసిన ప్రణబ్ ముఖర్జీ
నిజానికి, ఆయన ప్రధాని కావలసిన వాడు. అయితే, రెండుసార్లు ఆ అవకాశం వచ్చినా, అది తప్పిపోయింది. ‘బెంగాలీలు ఎవ్వరూ ప్రధాని కాలేరని ఒక నానుడి .
బహుగుణ సంపన్నుడైన, రెండుసార్లు ప్రధాని పదవి తప్పిపోయిన ప్రణబ్ను చూస్తే, ఆ నానుడిని నమ్మవలసి వస్తున్నది!
ఆయనకు కూడా తాను ప్రధాని కావాలని ఉండేది. ఎప్పటికప్పు డు అది ఇట్టేవచ్చి, అట్టే తప్పిపోయేది! చివరికి రాష్ట్రపతి పదవితో సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఆయన మేధాశక్తి, సమస్యా పరిష్కార సామర్థ్యం ఏ శాఖనైనా నిర్వహించగల సామర్థ్యాన్ని పరిశీలిస్తే ఈయన రామ్నాథ్ కోవింద్ ఒక్కటేనా అనిపిస్తుంది.
ఏమా మేధాశక్తి!
ఆయనకు డైరీలు రాసే అలవాటున్నది. ఆయన రాసుకున్న అన్ని సంవత్సరాల డైరీలు ఉన్నాయి కాని, మధ్యలో ఒక ఆరేళ్లవి కనిపించకుండా పోయినవట!
ఒకరోజు ఒక పరిచితుడు ఆయనను చూడ్డానికి వచ్చినప్పుడు ప్రణబ్ ఆయనను పట్టించుకోకుండా అలాగే రాసుకుంటూపోతున్నారు.
ఆ తర్వాత పూర్తి అయినాక ఈ పరిచితుని పలకరించి, ‘సారీ! నా ఆరేళ్ల డైరీలు కనిపించలేదు. అందువల్ల వాటిని తిరిగి రాస్తున్నానని ప్రణబ్ ప్రత్యుత్తరం!
‘మరి, డైరీలు లేవు కదా! ఎలా రాస్తున్నారని అడిగితే, ‘జ్ఞాపకశక్తి అని ప్రణబ్ సమాధానమిచ్చేసరికి ఆ మిత్రుడు నిర్ఘాంతపోయాడు!
ఔను! ఆరేళ్ల దైనందిన చర్యలు వరస తప్పకుండా ఎవరికైనా ఎలా జ్ఞాప కముంటాయి? అది ప్రణబ్కే సాధ్యం!
మచిలీపట్నం గురించి మన కంటే ఎక్కువ తెలుసు!
ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రముఖులు కొందరు ఆయనను కలుసుకుని, రాష్ట్రాన్ని చీల్చరాదని కోరారు.
ఆయన వారికి తెలియని ఆంధ్రప్రదేశ్ను గురించి ఎన్నో విషయాలు వారికి తెలియచెప్పుతూ మచిలీపట్నం గురించి ఆ పట్టణం వారికే తెలియని ఎన్నో విషయాలను వారికి తెలియ చెబుతున్నప్పుడు తెల్లబోవడం వారివంతయింది! అంత మేధావి ప్రణబ్!
కిరణ్కు పట్టాభిషేకం
రోశయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నరాగా, కాంగ్రెసు హైకమాండ్ ప్రణబ్ను హైదరాబాద్ పంపింది.
ఆయన పోటీ వార్లందరిని తన చాకచక్యంతో ఒప్పించి, ఎవ్వరూ ఊహించని కిరణ్కుమార్ రెడ్డికి పట్టంకట్టించారు!
ఇలా కానరాని తన మేధాశక్తిని, చాకచక్యాన్ని అనేక సందర్భాలలో ఉపయోగించి, కాంగ్రెసు అధిష్ఠానానికి చిక్కులు తప్పించిన మహామేధావి ప్రణబ్కుమార్ ముఖర్జీ!.
- డాక్టర్ తుర్లపాటి కుటుంబ రావు,(‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/