కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు

బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష

CM Revanth Reddy

హైదరాబాద్‌ః కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. శనివారం ఆయన సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‍ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని ఆదేశించారు.