వైసీపీ నేతల దాడి ఫై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. సమస్య ను తెలియజేస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సమస్య పెద్దదవుతుందని తప్ప పరిష్కారం కాదని పవన్ అన్నారు. రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియచేస్తే దాడులు చేస్తారా? పోలీసుల సమక్షంలోనే ఆమదాలవలస జనసేన నాయకుడు రామ్మోహన్ రావు పై దాడి చేశారని పవన్‌ నిప్పులు చెరిగారు.

మా కార్యకర్తలపై దాడి జరిగితే తానే స్వయంగా రోడ్ల పైకి వస్తానని హెచ్చరించారు పవన్‌. ఆ పరిస్థితి తీసుకురావొద్దని కోరుతున్నానని… అందరికీ సమన్యాయం చేయాలని పోలీసులను అభ్యర్ధిస్తున్నాని తెలిపారు. మా వాళ్లపై కేసులు పెట్టి దాడులు చేయడం ఆపేసి వైసీపీ ప్రభుత్వం ప్రజాసమస్యల పై దృష్టి సారించాలని హితువు పలికారు.

అంతకు ముందు జనసేన పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో అధ్వాన్నంగా మారిన రోడ్లను ఫోటోలు తీసి ఓ భారీ ప్లెక్సీని ఏర్పాటు చేసారు జనసేన నాయకులు. అయితే ఆ ప్లెక్సీలో స్పీకర్ తమ్మినేని ఫోటోను కూడా వాడటంతో జనసేన-వైసిపిల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే జనసేన నియోజకవర్గ ఇంచార్జిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు.