విపక్షాల వాకౌట్..రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమైంది. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించిన తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ డిమాండ్ను చైర్మన్ వెంకయ్యనాయుడు కొట్టిపారేశారు.
రాజ్యసభలో రేపటి నుంచి రైతు సమస్యలపై చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ తన ప్రసంగంలో రైతు ఆందోళనల గురించి మాట్లాడారని, నిజానికి ఇవాళే సభలో చర్చ చేపట్టాలని ఉందని, కానీ తొలుత ఆ సబ్జెక్ట్పై లోక్సభలో చర్చ మొదలవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ప్రసంగంపై రేపటి నుంచి చర్చ ఉంటుందన్నారు. సాగు చట్టాలపై సభలో గతంలోనే చర్చించామని, చర్చ జరగలేదని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, ఓటింగ్ అంశంలో ఆయా పార్టీలకు ప్రత్యేక అభిప్రాయాలు ఉంటాయన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఉదయం11.30 వరకు వాయిదా వేశారు. అంతకముందు సాగు బిల్లులు జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని, వాటిపై పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలని టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రాయ్ కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/