మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్కు ఈడీ నోటీసులు
రాంచీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి జార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్కు సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్ ఆఫీసులో సోరెన్ను విచారించనున్నామని అధికారులు తెలిపారు.
కాగా, ఈ కేసుకు సంబంధించింది గతంలో పంపిన సమన్లపై సోరెన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని విచారణ సంస్థ అరెస్టు చేసింది. వారిలో 2011 బ్యాచుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఛవీ రంజన్ కూడా ఉన్నారు. ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా, రాంచీ డిప్యూటీ కమిషన్గా పనిచేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సోరెన్ను గతేడాది నవంబర్లో ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.