యాదగిరిగుట్టలో పెను విషాదం : పాత భవనం కూలి నలుగురు మృతి
శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్టలో పెను విషాదం చోటుచేసుకుంది. పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు మృతి చెందారు. యాదగిరి గుట్టలోని మెయిన్ రోడ్డులోని పోలీసు స్టేషన్ ఎదురుకుండానే ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
భవనం శిథిలాల్లో మరికొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కూలిన రెండంతస్తుల భవనం 35 ఏండ్ల క్రితం నిర్మించినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు. మృతులను యాదగిరిగుట్టకు చెందిన దశరథ్ గౌడ్, శ్రీను, ఉపేందర్, శ్రీనాథ్ గా పోలీసులు గుర్తించారు.