సీఎం కేసీఆర్ ఫై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. గురువారం కామారెడ్డి పర్యటనకు వచ్చిన ఆమె..టిఆర్ఎస్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని దీంతో అడ్డగోలుగా అవినీతి జరిగిందన్నారు. ప్రాజెక్టు అంచనా 38 వేల 500 కోట్ల నుంచి లక్షా 20 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు.

తెలంగాణలో అప్పుడే పుట్టిన బాబుకు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ” నేను తెలంగాణ ప్రజలకు కోసం నమస్కరిస్తున్న. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి తెలంగాణలో అమల్లోకి రావాలి. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేనే ప్రధానమంత్రిని అని కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారు. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు. ఉపాధి హామీ పథకం కోసం 20 వేల కోట్లు ఇచ్చాము.

ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు. మేము పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారు. ప్రజలను భయపెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారు. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండి. లిక్కర్ స్కాంపై ఎవరి ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతుంది. పీఎం అవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంగా మార్చారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా రైతులకు పంటలు ఎలా నష్టపోయినా పరిహారం కేంద్రం అందిస్తుందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెలు, చేపల పెంపకానికి కూడా కేంద్రం ఇస్తున్న నిధులే రాష్ట్ర ప్రభుత్వం వాడుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో ఇవాళ రైతులు అప్పుల పాలయ్యారని తెలిపారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదన్నారు.