ఏపీ మాజీ మంత్రి కూడా సీఐడీ నోటీసులు
ఈ నెల 23న విచారణకు రావాలన్న అధికారులు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆయనతో పాటు ఏపీ మాజీ మంత్రి పి.నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం నారాయణ హైదరాబాద్లో లేరు. ఆయన ఈ నెల 23న విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నోటీసులపై ఇప్పటిరకు చంద్రబాబు, నారాయణ స్పందించలేదు.
ఏపీలో గత ప్రభుత్వంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు, నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి గత నెల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే ఈ రోజు చంద్రబాబు, నారాయణకు నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/