‘నిజం గెలవాలి’ రేపటి నుంచి నాలుగు రోజులపాటు భువనేశ్వరి యాత్ర
రేపు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్న భువనేశ్వరి
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/02/nara-bhuvaneswari-nijam-gelavali-yatra-starts-from-tomorrow-jpg.webp)
అమరావతిః ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న టిడిపి అధినేత నారా చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి రేపటి నుంచి మరోమారు యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. వారిని ఓదార్చి ఆర్థికసాయం అందిస్తారు.
రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గుంటూరు, నరసరావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. రేపు (6న) మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగుతుంది. 8న తాటికొండ, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు.