‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగియవచ్చు’: సోనియా గాంధీ
రాయ్పూర్: రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. చత్తీస్ఘడ్ లోని రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. డాక్టర్ మనోహ్మన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో తమ పార్టీ విజయం సాధించడం తనకు ఎనలేని సంతృప్తిని ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కానీ భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుందని, ఆ యాత్ర తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి అదే టర్నింగ్ పాయింట్ అవుతుందని సోనియా గాంధీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని, ఎందుకంటే బిజెపి, ఆర్ఎస్ఎస్లు దేశంలో అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. కొంత మంది వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఆమె చెప్పారు. సామరస్యం, సహనం, సమానత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నట్లు భారత్ జోడో యాత్రతో తెలిసిందని సోనియా అన్నారు.