3 రాజధానులపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
రాజ్యసభలో కనకమేడల, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఏపిలో మూడు రాజధానుల ఏర్పాటు, విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్ ఏర్పాటు వంటి అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి ఎంపీ కనకమేడల, వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు రాజ్యసభలో మాట్లాడారు. ఏపిలో రాజధానుల విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, వైఎస్ఆర్సిపి సర్కారు చర్యలను నియంత్రించాలని కనకమేడల కోరారు. మూడు రాజధానులపై వైఎస్ఆర్సిపి తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని ఆయన అభ్యంతరాలు తెలిపారు.
విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ బెంచ్ ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. ఏపీలో 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే పని చేస్తున్నారని, అయితే, ఏపిలో క్యాట్ బెంచ్ లేకపోవడంతో పిటిషనర్లు తమ వివాదాల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్కు వెళ్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/