శ్రీరామనవమి వేళ ప్రధాని మోడీ ఎమోషనల్ ట్వీట్
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు రామస్మరణతో గడిపేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు సైతం శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని కృప వల్లే ఈ ఏడాది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను చూడగలిగానని అన్నారు. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయని వ్యాఖ్యానించారు. అయోధ్యలో నేడు మొట్ట మొదటి శ్రీరామనవమి వేడుక జరుగుతున్న దృష్ట్యా మోదీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు.
‘‘శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య మందిరంలో రామ్లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం కలిగింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం’’ అని మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసారు.