కాంగ్రెస్ పార్టీ నుండే వచ్చాను… మళ్లీ అదే పార్టీలోకి వెళ్తానుః ఎమ్మెల్యే రేఖానాయక్
బిఆర్ఎస్ తనను పక్కన పెట్టిందని ఆవేదన
హైదరాబాద్ః తాను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ నుండే బిఆర్ఎస్లోకి వచ్చానని, మళ్లీ అదే కాంగ్రెస్లోకి వెళ్తానని వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసే వరకు తాను బిఆర్ఎస్లో ఉంటానని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ తనను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్ పేరు లేదు. ఆమె స్థానంలో మరొకరికి టిక్కెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్త కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కూడా ఎప్పుడైనా చేరే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసిన తర్వాత చేరుతానని ఆమె చెప్పడం గమనార్హం.