హైదరాబాద్ వస్తే అంతు చూస్తామని మునావర్ ఫారూఖీ కు రాజాసింగ్ వార్నింగ్

MLA rajasingh warning to munawar faruqui

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మునావర్ , ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ తను షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 20వ తేదీన డోంగ్రీ టు నోవేర్ పేరుతో లైవ్ షో ఏర్పాటు చేస్తున్నట్టు మునావర్ ఫారూఖీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే మునావర్ ఫారుఖీ షో విషయంలో అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసిన గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోమారు మునావర్ ఫారూఖీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ వ్యతిరేకి అయిన మునావర్ కామెడీ షో హైదరాబాద్‌లో నిర్వహించడానికి వీల్లేదని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆయన హైదరాబాద్‌కు వస్తే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు.

మునావర్ ఫారూఖీ గత జనవరిలోనే హైదరాబాద్‌లో షో నిర్వహణకు ముందుకు రాగా.. మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్‌మీడియా వేదికగా స్వాగతం పలికారు. దీంతో అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేపీ నేతలు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు.. హిందూ సమాజాన్ని కామెడీ చేసే వాళ్లకి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వెనక్కి తగ్గని కేటీఆర్.. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని, మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో కొన్ని కారణాల వల్ల మునావర్ షో రద్దు కావడంతో వివాదానికి తెరపడింది అయితే తాజాగా ఈ నెల 20వ తేదీన డోంగ్రీ టు నోవేర్ పేరుతో లైవ్ షో ఏర్పాటు చేస్తున్నట్టు మునావర్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడంతో వివాదం మళ్లీ మొదలైంది. ఫారుఖీ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. మునావర్ ఫారూఖీకి ఎవరైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. ఫారూఖీ హైదరాబాద్ లో అడుగు పెడితే తాము చేయాల్సింది చేసి తీరుతామని హెచ్చరించారు.