శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ః దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం)ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు.
శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని రూ.714 కోట్లతో నిర్మించారు. ఈ పథకం ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్పూర్, నర్సాపూర్ (జి), కుంటాల, సారంగాపూర్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, సోన్ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందించే అవకాశం కలిగింది. 20 ఏండ్లుగా ఒకే పంటకు పరిమితమైన భూముల్లో ఇక మూడు పంటలు రానుండగా, అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, నిర్మల్ నియోజకవర్గ రైతులకు సాగు నీరందేలా చేసిన సిఎం కెసిఆర్కు రైతన్నలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.