కెనడా వివాదంపై స్పందించిన జైశంకర్
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యా ఘటనపై భారత్, కెనడా దేశాలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిజ్జార్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. నిజ్జార్ గురించి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదన్నారు. ఫైవ్ ఐస్ దేశాలతో కానీ, ఎఫ్బీఐతో కానీ తాము భాగస్వామ్యులం కాదు అని మంత్రి జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న విదేశీ వ్యవహారాల మండలి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజ్జార్ హత్య కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే ఫైవ్ ఐస్ పార్ట్నర్స్తో నిజ్జార్ గురించి ఇండియా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు ఇటీవల అమెరికా పేర్కొనడంతో ఆ వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఫైవ్ ఐస్లో తాము భాగం కాదు అని, ఎఫ్బీఐతోనూ తాము భాగస్వాములం కాదు అని అన్నారు. సరైన వ్యక్తిని ఆ ప్రశ్న వేయడంలేదని అన్నారు.
కెనడాలో వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నట్లు మంత్రి జైశంకర్ ఆరోపించారు. రాజకీయ కారణాల కోసం ఆ నేరాల్ని కెనడా భరిస్తున్న తీరును కూడా ఆయన ఖండించారు. నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉన్నట్లు కెనడా చేసిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు.