అల్లు అర్జున్‌కి థ్యాంక్స్‌ చెప్పిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు థాంక్స్ చెప్పారు. అడివి శేషు హీరోగా మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన మూవీ మేజర్. శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ క్రమంలో సినిమా చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ అభినందనలు తెలిపారు.

‘సినిమా గుండెకు హత్తుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది షో అడివి శేష్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడు. కథలో కీలక పాత్రలకు ప్రకాశ్‌రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభితా దూళిపాల చక్కని సపోర్ట్‌ అందించారు. దర్శకుడు శశి కిరణ్‌ తిక్కా తన ప్రతిభ చూపించారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. ప్రేక్షకులకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత మహేశ్‌గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ‘మేజర్‌’ కథ ప్రతి భారతీయుడి గుండెను హత్తుకుంటుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ట్వీట్ కు మహేష్ బాబు రిప్లయ్ ఇచ్చాడు. అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘థ్యాంక్స్‌ అల్లు అర్జున్‌. మీ మాటలు మేజర్‌ టీమ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ‘మేజర్‌’ మూవీ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.ప్రస్తుతం మహేశ్‌ బాబు ట్వీట్‌ నెట్టింట వైరల్‌ గా మారింది.

26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శేష్ ఈ మూవీ లో హీరోగా నటించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. శశి కిరణ్ తిక్క ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించగా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అడివి శేషు యాక్టింగ్ ఫై , శశి డైరెక్షన్లపై ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.