రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు
విదేశాలకు రూ. 16 కోట్లు తరలించిన రాయపాటి

హైదరాబాద్: మాజీ ఎంపి, టిడిపి పార్టీ నేత రాయపాటి సాంబశివరావుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసును రిజిస్టర్ చేసింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై రెండు రోజుల నుంచి దాడులు జరిపిన తరువాత, నిధుల అక్రమ మళ్లింపుపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాయపాటితో పాటు సంస్థలో గతంలో పనిచేసిన ఉన్నతాధికారులపైనా అభియోగాలను నమోదు చేసింది. సింగపూర్, మలేషియాలకు రూ. 16 కోట్లను తరలించడం వెనుక రాయపాటి హస్తముందన్నది ప్రధాన అభియోగం. రాయపాటితో పాటు ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్ ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్ తదితరులనూ నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కేసును రిజిస్టర్ చేయగా, తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగడం గమనార్హం. మొత్తం 15 బ్యాంకుల నుంచి రూ. 8,832 కోట్లను రుణంగా తీసుకున్న ట్రాన్స్ ట్రాయ్, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం అయింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/