నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం..

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. ప్రియురాలిని యువకుడు గన్‌తో కాల్చాడు. అనంతరం ప్రేమికుడు కూడా తనను కాల్చుకుని చనిపోయాడు. యువతి మాత్రం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. తాటిపర్తికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలో బెంగళూరులో పనిచేసేవారు.. కానీ వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో ఊర్లోనే ఉంటున్నారు. సురేష్, కావ్యలు తమ ప్రేమ విషయం ఈ మధ్యే పెద్దలకు తెలిసింది. తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారట. సురేష్‌తో పెళ్లికి కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు.ఎన్ని సార్లు ఒప్పించడానికి ట్రై చేసిన అంగీకరించకపోవడంతో.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న సురేష్‌రెడ్డి.. మరోసారి కావ్య పేరేంట్స్, బంధువులతో మాట్లాడేందుకు ఇవాళ తాటిపర్తికి వెళ్లాడు.. కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని మరోసారి ఒప్పించే ప్రయత్నం చేశాడు.

ఒప్పుకోకపోతే తుపాకీతో బెదిరించైనా ఒప్పించాలనే.. తన వెంట తుపాకీ కూడా తీసుకొని వెళ్లినట్టుగా తెలుస్తుండగా.. ఈరోజు కావ్య పేరేంట్స్ తో గొడవపడ్డ సురేష్ రెడ్డి.. ఆవేశంతో ఆ తర్వాత కావ్యపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు.. ఇద్దరూ మృతిచెందడంతో.. విషాదంగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.. అసలు సురేష్ ఉపయోగించిన తుపాకీకి లైసెన్స్ ఉందా లేదా కూడా ఆరా తీస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన వారిని ప్రశ్నిస్తున్నారు.