మారటోరియం కేసులో విచారణ వాయిదా
న్యూఢిల్లీ: మారటోరియం కేసులో విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 13వ తేదీకి వాయిదా వేసింది. లాక్డౌన్ వేళ రుణాలపై మారిటోరియం విధించిన నేపథ్యంలో ఆ అంశాన్ని సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారించింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర తన అఫిడవిట్లో సరిగా వివరించలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. మళ్లీ తన అఫిడవిట్ను దాఖలు చేయాలని కేంద్రానికి వారం రోజుల గడువును సుప్రీం ఇచ్చింది. మహమ్మారి సమయంలో ఆలస్యమైన ఈఎంఐలపై, చక్రవడ్డీలను వసూల్ చేయరాదు అని సప్రీంలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఆ అభ్యర్థనలపై సుప్రీం ఇవాళ విచారణ చేపట్టింది. విద్యా, గృహ రుణాలు, క్రెడిట్ కార్డు బాకీలు చెల్లింపు విషయంలో చిన్న వ్యాపారులపై చక్రవడ్డీ వసూల్ చేయదలుచుకోలేదని గత శుక్రవారం సుప్రీంకోర్టుతో కేంద్రం వెల్లడించింది. అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు .. కేంద్రం కానీ, ఆర్బీఐ కానీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని సుప్రీం తెలిపింది. కామత్ ప్యానెల్ను కేంద్ర అంగీకరించింది. ఒకవేళ అంగీకరిస్తే ఆ విషయాన్ని తమ అఫిడవిట్లో పొందుపరచాలని కేంద్రానికి సుప్రీం సూచన చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/