మద్యం కేసు..హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు
అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జైలు నుంచి ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం బయటకు అడుగుపెట్టనున్నారు. స్కిల్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు వస్తుందని ఊహించిన ప్రభుత్వం మరో కేసుతో ఆయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది. ముందు రోజే చంద్రబాబుపై మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతిచ్చారని సీఐడీ కేసు పెట్టింది. ఆయనను ఏ3గా చేర్చి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. టిడిపి చీఫ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. కాగా, గత ప్రభుత్వం మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిందని సీఐడీ ఆరోపిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.